ఆర్ఎఆర్ఎస్ శాస్త్రవేత్తలకు మొక్కను బహుకరిస్తున్న చైర్మన్ నాగిరెడ్డి,ఎంపీ మాధవి
సేంద్రియ సాగుకి ప్రోత్సాహం
చింతపల్లి, అక్టోబరు 13:(వి. డేవిడ్)
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసీ రైతుల వ్యవసాయ ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. గురువారం అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, జీసీసీ చైర్పర్సన్ శోభ స్వాతి రాణితో కలిసి చింతపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని సందర్శించి, శాస్త్రవేత్తలు చేపడుతున్న వివిధ పంటల ప్రయోగాత్మక సాగు, ఔషధ మొక్కల బ్లాక్ని పరిశీలించారు. హెచ్ఎన్టీసీ, ఏకో పల్పింగ్ యూనిట్, ఉద్యాన పరిశోధన స్థానాన్ని సందర్శించారు. చౌడుపల్లి, చిన్నగెడ్డ, గొందిపాకలు, రాజుపాకలు, లంబసింగి గ్రామాల్లో గిరిజన రైతులు సాగుచేస్తున్న వరి, రాజ్మా, చోడి, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, అవకడు తోటను పరిశీలించారు. ఈసందర్భంగా ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ విలేఖర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకువ్యవసాయ మిషన్ వివిధ జిల్లాల్లో పర్యటించి రైతులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. పరిశోధన స్థానాలు, కేవీకేలు, రైతుల పంట పొలాలను స్వయంగా పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయ౦ గా తెలుసుకుంటున్నామన్నారు.
గిరిజన రైతులు పండించిన రాజ్మా , వలిసెలు, రాగి, వరి, పసుపు, అల్లం, కాఫీ, మిరియాలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాఫీకి ఐటీడీఏ సహకారంతో మ్యాక్స్ ద్వారా అంతర్జాతీయ ధరలు అందించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో ఇతర పంటలకు కూడా కాఫీ మాదిరిగా గరిష్ఠ ధరలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. వ్యవసాయం ద్వారా ఆదివాసీ రైతుల ఆదాయం పెంపొందించమే వ్యవసాయ మిషన్ లక్ష్యమన్నారు. అల్లూరి జిల్లా సేంద్రియ సాగుకి అత్యంత అనుకూలమని, దీంతో ఆదివాసీ రైతులు పంటలన్నీ సేంద్రియ పద్ధతిలో సాగుచేసేందుకు అవసరమైన ప్రోత్సాహం అందజేస్తామన్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు, రైతుల మధ్య సమన్వయం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆర్ఎఆర్ఎస్ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపిన ప్రజాప్రతినిధులు .. ప్రాంతీయ పరిశోధన స్థానంలోని సాగుచేస్తున్న పంటలు, ఔషధ మొక్కలు, ప్రకృతి అందాలను అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, జెడ్పీచైర్ పర్సన్ సుభద్ర, జీసీసీ చైర్పర్సన్ స్వాతి రాణిలు ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారు. గిరిజన ప్రాంతంలో లభించే అరుదైన ఔషధ మొక్కలను వీక్షించారు. సహజ సిద్ధ ఊయలలోఊగి ప్రజాప్రతినిధులు సందడి చేశారు.
వివిధ మొక్కల వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. పరిశోధన స్థానాన్ని ప్రతి ఒక్కరు సందర్శించాల్సిన ప్రాంత మని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ మిషన్ సభ్యులు జె. రామారావు, డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ ఎం. సరస్వతి, ఆర్ఎఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ ఎం. సురేశ్ కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికరి ఎస్బీఎస్ నంద్, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ కె. నాగసాయి, సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ సీతారామ్, డాక్టర్ మోహన్రావు, ఏడీఏ కంటా జాహ్నవి, ఎంపీపీ కోరాబు అనుషదేవి, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, మేజర్ పంచాయతీ సర్పంచ్ దురియా పుష్పలత, ఎంపీడీవో లాలం సీతయ్య, కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి వ్యవసాయ అధికారులు కృష్ణవేణి, మధుసుదనరావు, కన్నబాబుపాల్గొన్నారు.
0 Comments