అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోడ్లు, కల్వర్టులు నిర్మాణానికి రూ.100 కోట్లు నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ రాజ్ ఆరోఖ్య రాజ్ అన్నారు. శనివారం అల్లూరి, మన్యం జిల్లాల కలెక్టర్ లతో అమరావతి నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలకు, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి అవసరమైన రోడ్లు, కల్వర్టులు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 992 డోలి మోతల గ్రామాలు ఉన్నాయని చెప్పారు. రానున్న మూడేళ్లలో రూ.735 కోట్లతో మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మించడానికి ప్రణాళికలు తయారు చేయడం జరిగిందన్నారు. ఆర్ సి పి ఎల్ డబ్ల్యూ కింద రూ.39 కోట్లతో రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయని మరో మూడు నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. ఆర్ సిపిఎల్ డబ్ల్యుఇఎ కింద రు.55 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. వీటిలో రూ 21.39 కోట్లతో 24.59 కిలోమీటర్ల రోడ్లు, రూ 34.29 కోట్లతో 11 బ్రిడ్జ్ లు నిర్మిస్తామని చెప్పారు. రైతులకు అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టామన్నారు.ఈ సమావేశంలో డిఈఓ డాక్టర్ పి. రమేష్ , గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఐ. కొండలరావు ,ఈఈ లు డివిఆర్ఎం రాజు, కె.వేణుగోపాల్, పంచాయతీరాజ్ ఈఈ కే లావణ్య కుమార్ ఇతరులు పాల్గొన్నారు.
0 Comments