లాక్ డౌన్ కాలంలో ప్రజలకు దాతలు ఉచితంగా వస్తువులు గాని, ఇతర సామాగ్రి గాని పంపిణీ చేయాలనుకుంటే స్థానిక అధికారులు ఎస్సై , తహసిల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ అధికారులకు సంప్రదించి ముందస్తు అనుమతి తీసుకోవాలని జిల్లా ఎస్పి అట్టాడ బాబూజీ తెలియజేశారు. జిల్లా ఎస్పీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే దాతలు సంబంధిత అధికారులను ముందుగా సంప్రదించి, సంబంధిత అధికారులు ఎక్కడ, ఎప్పుడు, ఏవిధంగా పంపిణీ చెయ్యాలో నిర్ణయించి తగిన ఏర్పాట్లు చేస్తారని పేర్కొన్నారు . కావున సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎవరైనా దాతలు గుంపులు, గుంపులు గా వెళ్ళి నిబంధనలను ఉల్లంఘించి పంపిణీ కార్యక్రమము చేపడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడునన్నారు. విశాఖపట్నం జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున అధికారుల అనుమతి లేకుండా పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం నేరమని పేర్కొన్నారు . ఇప్పటికే జిల్లాలో ఆవిధంగా నిబంధనలు ఉల్లంఘించి గుంపులు, గుంపులు వెళ్ళి ఉచితంగా పంపిణీ కార్యక్రమాలు చేసిన వ్యక్తులపై వివిధ మండలాలలో సుమారు 10 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. లాక్ డౌన్ ఆదేశాల నేపథ్యంలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై 130 కేసులు, ట్రాఫిక్ ఉల్లంఘించిన వారిపై 1304 కేసులు, గత సాయంత్రం 6 గంటల నుంచి నేటి సాయంత్రం 06 గంటల వరకు మొత్తం 1434 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 18 వాహనాలను స్వాధీనం చేసుకోని 144 వ్యక్తులను అరెస్ట్ చేసి రూ.7,84,040/- ఆపరాధ రుసుం వసూలు చేశామన్నారు.
0 Comments